తెలుగులో తిరుగులేని నటుడు…

Written by TV2O TELUGU

Published on:

తెలుగులో తిరుగులేని నటుడు.. ఆ ఒక్కతప్పుతో జీవితం నాశనం.. చివరకు హాస్పటల్‌కు వెళ్ళడానికి కూడా డబ్బులు…
పి. ఎల్. నారాయణ.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విలక్షణమైన నటుడిగా, రచయితగా తనదైన ముద్ర వేశారు. జాతీయ అవార్డుతో పాటు పలు నంది అవార్డులను అందుకున్న ఆయన జీవితం, సినీ రంగంలో అరుదైన ప్రతిభను, అదే సమయంలో విషాదకరమైన అంతాన్ని చూసింది. 1935లో బాపట్లలో జన్మించిన పి. ఎల్. నారాయణ, మలయాళీ మూలాలున్న కుటుంబానికి చెందినవారు. ఆయన తల్లిదండ్రులు కేరళ నుంచి వలస వచ్చి బాపట్లలో స్థిరపడ్డారు. బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, బాపట్ల, చీరాలలో విద్యాభ్యాసం చేశారు. రామానాయుడు ఆయన క్లాస్ మెట్. ఒంగోలులో నాటకాలు ప్రదర్శిస్తూ తన కమ్యూనిస్ట్, ప్రజాస్వామ్యవాద సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రజలకు ఏదో చెప్పాలనే సామాజిక బాధ్యత ఆయనలో ప్రబలంగా ఉండేది. బాలచందర్ దర్శకత్వంలో ‘మరో చరిత్ర’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన పి. ఎల్. నారాయణ, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు.
ప్రతిఘటన చిత్రంలో కోట శ్రీనివాసరావు పాత్రను డవలప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. తన సహజ నటనతో పాటు, రచయితగానూ ఆయనకు గొప్ప పేరుంది. టి. కృష్ణ, ఆర్. నారాయణమూర్తి, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకుల కమ్యూనిస్ట్ సినిమాలకు ఆయన పర్మినెంట్ నటుడు, రచయిత. ‘ఖైదీ’లో చిరంజీవి తండ్రి పాత్ర, ‘కుక్క’ చిత్రానికి నంది అవార్డు, ‘నేటి భారతం’, ‘రేపటి పౌరులు’, ‘వందేమాతరం’, ‘కర్తవ్యం’ వంటి అనేక చిత్రాలలో ఆయన ఎంతో ప్రశంసలు అందుకున్నారు. గుత్తా రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘యజ్ఞం’ చిత్రంలో ‘అప్పల్ నాయుడు’ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ‘దండోరా’ చిత్రానికి సంభాషణలు రాసి నంది అవార్డు అందుకున్నారు. దాదాపు 100సార్లు ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నారు.
చిరంజీవి వంటి అగ్ర నటులు కూడా ఆయన నటనకు, వ్యక్తిత్వానికి గౌరవం ఇచ్చేవారు. పి. ఎల్. నారాయణ డబ్బును ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. తనలాంటి కష్టాల్లో ఉన్న తోటి కళాకారులకు ఎల్లప్పుడూ సహాయం చేసేవారు. అయితే, ఆయన జీవితం చివరి దశలో విషాదకరంగా మారింది. మద్యపాన వ్యసనం ఆయన ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసింది. సినీ పరిశ్రమలో కమర్షియల్, యూత్ చిత్రాల ట్రెండ్ పెరగడంతో, ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆదాయం లేక, అనారోగ్యం పాలై, వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితికి చేరుకున్నారు. తాగుడు వ్యసనం కారణంగా సన్నిహితులు కూడా ఆయనను దూరం పెట్టారు. చివరకు తాగుడుకు రూ. 100, రూ.50 అడుక్కునే పరిస్థితికి వచ్చారు. 1998లో ఆరోగ్యం క్షీణించి, లివర్ పాడై, తీవ్ర నిరాదరణ మధ్య ఆయన కన్నుమూశారు…

Leave a Comment