మోసగాళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు..!
పావలా ఆశ చూపి పది రూపాయలు టోపీ పెడుతున్నారు..!
ఒకడేమో ప్రీలాంచ్ పేరుతో కోట్లు కొల్లగొడతాడు..!
ఇంకొకడు పెట్టుబడుల పేరుతో సాంతం దోచేస్తాడు..!
ఇలాంటి మోసాలు ప్రతిరోజూ వినిస్తూనే ఉన్నా.. బీ అలర్ట్ అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నా అత్యాశతో బొక్కాబోర్లా పడుతున్నారు కొందరు.
ఇప్పుడు అలాంటి మోసమే మరోటి వెలుగులోకొచ్చింది.
సింగిల్ లేడీ 300 కోట్లు కొల్లగొట్టడం షాక్కు గురిచేస్తోంది.
ఈమె పేరు.. సంధ్యారాణి. ప్రముఖులు, అధికారులే ఈమె టార్గెట్. గార్మెంట్ కంపెనీలో డబ్బులు పెడితే అధిక వడ్డీలొస్తాయని ఎంతో మందిని బురిడీ కొట్టించింది. దాదాపు 300 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈమె చేతిలో మోసపోయిన వైజాగ్కు చెందిన దొరైరాజు అనే వ్యక్తి.. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘరానా మోసం బయటపడింది. సంధ్యారాణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే.. సంధ్యారాణి బాధితుల లిస్ట్లో ప్రముఖులతో పాటు IASలు, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, ఎంతోమంది వస్త్ర వ్యాపారులున్నట్లు తేల్చారు. ఒకే గేటెడ్ కమ్యూనిటీలో సంధ్యారాణి 180 కోట్లు కలెక్ట్ చేయడం చూసి అధికారులే అవాక్కవుతున్నారు. అంతేకాదు.. GST, TDS ఇన్వాయిస్లు మార్చి కస్టమర్లను బురిడీ కొట్టించినట్లు తెలిపారు. మోసం బయటకు రాగానే దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు వెల్లడించారు. ఇంటిపేరు మార్చి దుబాయ్ రెసిడెంట్ కార్డు కూడా పొందినట్లు పోలీసులు తేల్చారు.